సాక్షి,రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన గారాల పట్టి.. కూతురు జీవాతో గడుపుతాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నెల 22న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ వన్డే సిరీస్కు సమయం ఉండటంతో దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తన గారాల పట్టీ చిలిపి చేష్టలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ధోని.. తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ధోని తనకూతురు జీవాతో లడ్డు కోసం పోటీ పడ్డాడు. చివరికి ఈ పోటీలో గెలుపు జీవానే వరించగా.. ఈ వీడియోని ధోని మురిపంగా ‘అటాక్ ఆన్ బెసన్ లడ్డు’ అంటూ ఇన్స్ట్రాగమ్లో పోస్టు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 అనంతరం టీమిండియా ధోని నివాసాన్ని సందర్శించింది. ఆ సమయంలో కెప్టెన్ కోహ్లి జీవాతో సరదాగా ముచ్చటించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే.