కివీస్‌ క్లీన్‌స్వీప్‌

19 Jan, 2018 13:14 IST|Sakshi

వెల్లింగ్టన్‌:పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో కివీస్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగా, పాకిస్తాన్‌ 256 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే న్యూజిలాండ్‌ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. 

57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ సమయంలో హారిస్‌ సోహైల్‌(63), షాదబ్‌ ఖాన్‌(54)లు హాఫ్‌ సెంచరీలతో రాణించగా, ఫహీమ్‌ అష్రాఫ్‌(23), మొహ్మద్‌ నవాజ్‌(23), అమీర్‌ యామిన్‌(32 నాటౌట్‌)లు ఫర్వాలేదనిపించారు. దాంతో లక్ష్య ఛేదనలో దగ్గరకొచ్చిన పాకిస్తాన్‌ స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందింది. అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టులో మార్టిన్‌ గప్టిల్‌(100) సెంచరీ సాధించగా, రాస్‌ టేలర్‌(59) అర్థ శతకం నమోదు చేశాడు. కోలిన్‌ మున్రో(34), గ్రాండ్‌  హోమ్‌(29 నాటౌట్‌) దాటిగా బ్యాటింగ్‌ చేశారు.

మరిన్ని వార్తలు