పచ్చడి అన్నంతో ఒలింపిక్స్‌ పతకం చేజారింది!

16 Aug, 2018 17:07 IST|Sakshi

తిరువనంతపురం : అలనాటి పరుగుల రాణి పీటీ ఉష 1984లో లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పతకం చేజారడానికి కారణాలు చెబుతూ ఆవేదనం వ్యక్తం చేశారు. కేవలం పచ్చడి కలిపిన అన్నం మాత్రమే తనకు ఆహారంగా ఇవ్వడంతో శక్తికి మించి పరుగులు తీసినా భారత్‌కు పతకాన్ని అందించలేక పోయానని తెలిపారు. 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో ప్రతి రౌండ్‌లో అద్భుత ప్రదర్శన ఇస్తూ ఫైనల్స్‌కు వెళ్లారు.

‘ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించానని సంతోషించేలోపే ఆమె ఆనందం ఆవిరైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కొజోకరు కూడా అదే సమయంలో ఈవెంట్‌ పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే పీటీ ఉష కంటే సెకన్‌లో వందో వంతు సమయం ముందుగానే హర్డిల్స్‌ పూర్తి చేశారని ప్రకటింగానే తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పారు. ఒలింపిక్‌ గ్రామంలో కేవలం అమెరికా వంటకాలు, ఆహారం మాత్రమే దొరుకుతుందని ముందుగా మాకు ఎవరు చెప్పలేదు. ఒలింపిక్‌ విలేజ్‌లో పోషకాలున్న ఆహారం నాకు ఇవ్వలేదు. కేవలం మామాడికాయ పచ్చడి, అన్నం మాత్రే ఆహారంగా ఇచ్చారు. చికెన్‌, బంగాళాదుంపలు వంటి ఆహారాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది.

ఈ కారణంగా నా ఎనర్జీ లెవల్స్‌ చాలా తగ్గిపోయాయి. తొలి 45 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 6.2 సెకన్లలో పూర్తిచేసి అద్భుతంగా ఆరంభించా. శాయశక్తులా యత్నించినా చివరి 35 మీటర్ల రేసులో కాస్త నెమ్మదించాను. ఎందుకంటే తగినంత పోషకాహారం తీసుకోని కారణంగా మూడో స్థానాన్ని సైతం వెంట్రుకవాసిలో కోల్పోయి పతకాన్ని చేజార్చుకున్నానని’ లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో జరిగిన అనుభవాలను పీటీ ఉష నెమరువేసుకున్నారు. 

ప్రస్తుతం ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌పై పూర్తిగా దృష్టిసారించానని చెప్పారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మెరుగైన అథ్లెట్లను తయారు చేసి దేశానికి పతకాలు అందించడమే తన లక్ష్యమని పీటీ ఉష వివరించారు.

మరిన్ని వార్తలు