క్వార్టర్‌ ఫైనల్లో సైనా, సింధు

10 Mar, 2017 07:51 IST|Sakshi
క్వార్టర్‌ ఫైనల్లో సైనా, సింధు

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ రాకెట్లు సింధు, సైనా నెహ్వాల్‌ దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా రెండో రౌండ్‌ దాటని పూసర్ల వెంకట సింధుతో పాటు, 2015 రన్నరప్‌ సైనా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఒకవేళ వీళ్లిద్దరు క్వార్టర్స్‌ అడ్డంకిని అధిగమిస్తే... సెమీఫైనల్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతను 13–21, 5–21తో ఏడో సీడ్‌ తియాన్‌ హౌవే (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు.

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21–12, 21–4తో ఇండోనేసియాకు చెందిన దినార్‌ ద్యా అయుస్తిన్‌పై అలవోక విజయం సాధించింది. జోరు మీదున్న ఈ హైదరాబాదీ సంచలనం కేవలం అరగంటలోనే ప్రత్యర్థికి ఇంటిదారి చూపించింది. మరో పోరులో సీనియర్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ 21–18, 21–10తో ఫ్యాబియెన్‌ డెప్రిజ్‌ (జర్మనీ)ని వరుస గేముల్లో ఓడించింది. తొలి గేమ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో 12–8తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సైనా తర్వాత ప్రతిపాయింట్‌కు చెమటోడ్చాల్సి వచ్చినా చివరకు విజయం దక్కింది.

మరిన్ని వార్తలు