తొలి రౌండ్‌లోనే సైనా ఓటమి

18 Sep, 2018 14:34 IST|Sakshi

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్‌ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సైనా 22-20, 8-21, 14-21 తేడాతో సుంగ్‌ జీ హున్‌(దక్షిణకొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు.  

తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సైనా.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను చేజార్చుకున్నారు. ఇరువురు క్రీడాకారిణుల మధ్య తొలి గేమ్‌ హోరీ హోరీగా సాగగా, మిగతా రెండు గేమ్‌లను సుంగ్‌ జీ హున్‌ సునాయాసంగా గెలిచారు. దాంతో సైనా భారంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 

మరొకవైపు పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించారు. దాంతో సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి - సుమీత్‌ రెడ్డీ జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన మిన్‌ చున్‌- చింగ్‌ హెంగ్‌పై మను అత్రి - సుమీత్‌ జోడీ 13-21, 21-13, 21-12తో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు