గ్రాండ్ స్లామ్కు అడుగు దూరంలో

27 Jan, 2017 11:58 IST|Sakshi
గ్రాండ్ స్లామ్కు అడుగు దూరంలో

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి ఫైనల్కు చేరింది.  శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 2-6, (10-5) తేడాతో ఆస్ట్రేలియా జంట సమంతా స్టోసుర్-సామ్ గ్రాత్ల జోడిపై గెలిచి తుది రౌండ్కు చేరింది.  గంటా 18 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి చెమటోడ్చి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి సెట్ను కష్టపడి గెలవగా, రెండో సెట్ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్లో సానియా జోడి తన ఫామ్ను అందుకుంటూ స్టోసుర్ జంటను ఓడించింది.

ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జంటను స్టోసుర్-గ్రాత్ల జోడి ఓడించి సెమీస్ కు చేరగా, రోహన్ బోపన్న-గాబ్రియాలా డబ్రోస్కి ద్వయంపై సానియా-డో్డిగ్ జో్డి విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా మహిళల  డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగిస్ తో కలిసి  సానియా సాధించగా, 2009లో ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను మహేశ్ భూపతితో కలిసి సానియా తొలిసారి సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు