‘కోహ్లి.. ఆయనకు అప్‌గ్రేడెడ్‌ వర్షన్‌’

16 Feb, 2018 14:23 IST|Sakshi
సెహ్వాగ్‌- టీమిండియా కెప్టెన్‌ కోహ్లి (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, స్పోర్ట్స్‌ : దశాబ్దాల తర్వాత సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌ విజయం సాధించటంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా కోహ్లిని ఆకాశానికెత్తేస్తున్నాడు. కోహ్లీ.. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి అప్‌గ్రేడెడ్‌ వర్షన్‌ లాంటోడని పొగడ్తలు గుప్పించాడు.

‘ కోహ్లీ కెప్టెన్సీని గనుక గమనిస్తే పలు సిరీస్‌లు కైవసం చేసుకున్నాం. గత 8 సిరీస్‌లను గనుక గమనిస్తే.. మిగతా దేశాల కెప్టెన్‌లతో పోలిస్తే కోహ్లినే ఉత్తమ సారథిగా మనకు కనిపిస్తాడు. గతంలో గంగూలీ సారథ్యంలో కూడా టీమిండియా ఇలానే దూకుడు చూపించేది. ముఖ్యంగా విదేశీ గడ్డలపై జట్టు మంచి విజయాలను సాధించింది. అలాగని గతంలోని అత్యుత్తమ కెప్టెన్‌లతో అతని పోల్చటం సరికాదు. వారి స్థాయిని అందుకోవటానికి అతనికి మరింత అనుభవం, విజయాలు అవసరం’ అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. 

కెప్టెన్సీతో కోహ్లిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడని, అన్నింటికన్నా ముఖ్యంగా అతని ఆట మరింతగా మెరుగుపడిందని సెహ్వాగ్‌ చెబుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉందన్న వీరూ..  ఎప్పుడైతే బౌలర్లు మెరుగ్గా రాణించలేకపోతారో అప్పుడే కోహ్లి పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్న నేపథ్యంలో అద్భుత ప్రదర్శన ఇవ్వాలంటూ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

మరిన్ని వార్తలు