హైదరాబాద్‌లో సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్

7 Oct, 2014 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల తర్వాత హైదరాబాద్ మరోసారి సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే ఈ పోటీలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా నిలువనుంది. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 105 అంశాల్లో, ఎనిమిది వయోపరిమితి విభాగాల్లో పోటీలుంటాయి. సౌత్‌జోన్ అథ్లెటిక్స్ మీట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1989లో, ఆ తర్వాత 2000, 2011లలో హైదరాబాద్‌లో ఈ పోటీలు జరిగాయి.

     రెండు రోజులపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జట్టు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

     హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 750 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఆయా విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు నవంబరు 7 నుంచి 9 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయ ఇంటర్ జోనల్ చాంపియన్‌షిప్‌లో సౌత్‌జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు.

     ఈసారి పోటీల్లో భారత్‌కు వివిధ అంతర్జాతీయ మీట్‌లలో ప్రాతినిధ్యం వహించిన పలువురు యువతారలు బరిలోకి దిగనున్నారు. మేమన్ పౌలోజ్ (కేరళ-110 మీటర్ల హర్డిల్స్; యూత్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం); మిత్రా వరుణ్ (తమిళనాడు-డిస్కస్ త్రో; యూత్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానం); నసీముద్దీన్ (కేరళ-100 మీటర్ల హర్డిల్స్; లూసోఫోనియా గేమ్స్‌లో కాంస్యం); మహ్మద్ అఫ్జల్ (కేరళ-మిడిల్ డిస్టెన్స్; ఆసియా స్కూల్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం); లేఖా ఉన్ని (కేరళ-1500 మీటర్లు; ప్రపంచ స్కూల్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.



 

మరిన్ని వార్తలు