ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌–అశ్విని జంట

12 Apr, 2017 00:51 IST|Sakshi
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌–అశ్విని జంట

సింగపూర్‌ సిటీ: సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌–అశ్విని జంట 21–13, 21–14తో జూహీ దేవాంగన్‌–వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనే హైదరాబాద్‌కు చెందిన రంకీరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా జంట మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–మనీషా జోడీ 21–9, 21–12తో ఆండ్రూ యునాంతో–సుప్రియాది పుత్రి (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గగా... రెండో రౌండ్‌లో 21–18, 14–21, 21–11తో నందగోపాల్‌–మహిమా (భారత్‌) జంటను ఓడించింది.

మెయిన్‌ ‘డ్రా’కు సౌరభ్‌ వర్మ
మరోవైపు జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సౌరభ్‌ వర్మ 21–13, 23–21తో మిషా జిల్‌బెర్మన్‌ (ఇజ్రాయెల్‌)పై, రెండో రౌండ్‌లో 27–29, 21–18, 21–18తో పనావిత్‌ తోంగ్‌నువామ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఒకుహారా (జపాన్‌)తో పీవీ సింధు; సు యా చింగ్‌ (చైనీస్‌ తైపీ)తో రితూపర్ణ దాస్‌... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎమిల్‌ (డెన్మార్క్‌)తో సాయిప్రణీత్‌; హు యున్‌ (హాంకాంగ్‌)తో సమీర్‌; జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో సౌరభ్‌; షి యుచి (చైనా)తో జయరామ్‌; నిషిమోటో (జపాన్‌)తో శ్రీకాంత్‌ ఆడతారు.

మరిన్ని వార్తలు