వెల్‌డన్‌ టీమిండియా: కోహ్లి

25 Sep, 2018 11:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియాకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్‌ జట్టును రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభినందించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. టీమిండియా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో జట్టుకు అభినందనలు తెలియజేశాడు. ప్రధానంగా సూపర్‌ -4 స్టేజ్‌లో పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని కోహ్లి ప్రస్తావిస్తూ.. ‘వెల్‌డన్‌ బాయ్స్‌. మ్యాచ్‌ను చాలా ఎంజాయ్‌ చేశా. ఇదొక అద్భుత విజయం’అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు.

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను 237 పరుగులకే కట్టడి చేసిన భారత్‌..ఆపై 39.3 ఓవర్లలో విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ విజయంలో శిఖర్‌ ధావన్‌(114), రోహిత్‌ శర్మ(111)లు కీలక పాత్ర పోషించారు. ఈ జోడి మొదటి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందింది.


 

మరిన్ని వార్తలు