కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

22 Jul, 2019 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ పర్యటనకు సంబంధించి భారత క్రికెట్‌ జట్టు ఎంపిక తీరు సరిగా లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రధానంగా కేదార్‌ జాదవ్‌కు అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా జాదవ్‌ ఎందుకు బాస్‌ అంటూ బీసీసీఐ సెలక్టర్లపై మండిపడుతున్నారు. అదే సమయంలో విండీస్‌-ఏ పర్యటనలో విశేషంగా ఆకట్టుకున్న శుబ్‌మన్‌ గిల్‌కు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.‘కేదార్‌ జాదవ్‌కు అవకాశం ఇవ్వడం అసంతృప్తికి గురి చేసింది.. అతనికి జట్టులో పదే పదే చోటివ్వడం అనవసరం’ అని ఒక నెటిజన్‌ విమర్శించగా, ‘కేదార్‌ 2023 ప్రపంచకప్‌ వరకు ఆడగలడా?, ఏ ప్రాతిపదికన జాదవ్‌ను ఎంపిక చేశారు. యువ క్రికెటర్‌ గిల్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు’ అని మరొకరు ప్రశ్నించారు. (ఇక్కడ చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..)

‘విండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో ఆశ్చర్యం ఏముంది. అన్ని తెలుసున్న ముఖాలే. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కోహ్లి, రోహిత్‌లకు కూడా విశ్రాంతి ఇవ్వలేదు. ఇలా అయితే యువ క్రికెటర్ల ప్రతిభ ఎలా వెలుగులోకి వస్తుంది’ అని మరొక అభిమాని విమర్శించారు. ‘ గిల్‌ ఏం తప్పు చేశాడని అతన్ని బీసీసీఐ పక్కన పెట్టింది. మయాంక్‌ అగర్వాల్‌, గిల్‌ వంటి క్రికెటర్లకు వన్డే ఫార్మాట్‌లో అవకాశం కల్పించండి’ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ఇప్పుడు ఎంపిక చేసిన జట్టులో మ్యాచ్‌ విన్నరే లేడు’ అని ఒక అభిమాని అసంతృప్తి వ్యక్తం చేశాడు.( ఇక్కడ చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే)

మరిన్ని వార్తలు