యశ్‌ డబుల్‌ ధమాకా

23 Jul, 2018 10:29 IST|Sakshi

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: గోల్డ్‌స్లామ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సి. యశ్‌ గోయెల్‌ సత్తా చాటాడు. నారాయణగూడలోని వైఎంసీఏ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో యశ్‌ అండర్‌–14, 17 బాలుర విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్‌– 17 బాలుర సింగిల్స్‌ ఫైనల్లో యశ్‌ 11–6, 5–11, 11–3, 10–12, 11–5తో దివేశ్‌పై విజయం సాధించాడు. అండర్‌–14 బాలుర కేటగిరీలో యశ్‌ 11–7, 11–9, 12–10తో ఆకర్‌‡్షను ఓడించి విజేతగా నిలిచాడు. అండర్‌–17 బాలికల కేటగిరీలో విధి జైన్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్లో విధి 11–4, 5–11, 11–4, 4–11, 11–4తో భవితపై గెలుపొందింది. సబ్‌జూనియర్‌ బాలికల కేటగిరీలో పలక్‌ 11–6, 11–6, 11–6తో నిఖితపై నెగ్గింది. అండర్‌–12 కేటగిరీలో జె. గౌరి, తరుణ్‌ ముకేశ్‌ టైటిళ్లను గెలుచుకున్నారు. బాలుర ఫైనల్లో తరుణ్‌ 11–6, 11–8, 11–6తో రిషభ్‌ సింగ్‌పై, బాలికల టైటిల్‌పోరులో గౌరి 11–4, 11–4, 8–11, 11–6తో శ్రీవత్సపై విజయం సాధించారు. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గోల్డ్‌స్లామ్‌ స్పోర్ట్స్‌ ఎండీ ఎం. తిరుమల రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీటీఏ) ఉపాధ్యక్షుడు అమ్రుల్లా దస్తాని, రిఫరీ ప్రమోద్‌ చంద్ర పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు