సేలం, న్యూస్లైన్: నామక్కల్ జిల్లాలో బుధవారం సాయంత్రం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని కలెక్టర్ దక్షిణామూర్తి పరామర్శించారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు నుంచి బుధవారం సాయంత్రం ఒక ప్రైవేటు బస్సు 50 మంది ప్రయాణికులతో రాసిపురానికి బయలుదేరింది. ఆ బస్సు తిరుచెంగోడును దాటుకుని కొంత దూరం వెళ్లగానే రోడ్డుపై అదుపు తప్పి మెయిన్రోడ్డులో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఆ సమయంలో ప్రయాణికుల అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను తిరుచెంగోడు, నామక్కల్ జీహెచ్లకు తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ దక్షిణామూర్తి బుధవారం రాత్రి నామక్కల్ జీహెచ్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తిరుచెంగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.