పెళ్లి చూడకుండానే...

15 Sep, 2013 01:40 IST|Sakshi

ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా కాలు జారిన సంఘటనలో ఇదే మండలం బీపీ రాచపల్లెకు చెందిన పద్మరాజు కృతి (25) అకాల వృత్యువాతపడ్డారు. ఏడాదిన్నర కిందటే అరవింద్‌తో ఆమెకు వివాహం కాగా, ఆమె వృత్తి రీత్యా పుణెలో ఉంటున్నారు. భర్త బెంగళూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నారు.

ఆదివారం తమ స్వగ్రామంలో జరిగే చిన్నాన్న కుమారుడి పెళ్లికి రావాలని భర్తను ఒప్పించిన కృతి శుక్రవారమే ప్రయాణమైంది. అంతలోనే తాను పని చేసే సంస్థ నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావడంతో భర్త అర్ధంతరంగా స్వగ్రామ ప్రయాణం మానుకుని బెంగళూరుకు బయలుదేరారు. దీంతో కృతి ఒంటరిగానే బయలుదేరారు. పుణె నుంచి ప్రయాణం సాఫీగా సాగగా, తాన దిగాల్సిన రైల్వేస్టేషన్ వచ్చింది.

ఇక లగేజీతో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఆమె రైలు కిందపడిపోయారు. అదే సమయంలో రైలు కదలడంతో ఆమె అక్కడికక్కడే మాంసపు ముద్దగా మిగిలారు. రైలు దిగగానే ఆమె ఇంటికి పిల్చుకెళ్లాలని వచ్చిన చిన్న మామ(అరవింద్ చిన్నాన్న) ఇలా నీ వృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఏడ్చడం చూసిన వారి హృదయాలను బరువెక్కించింది. కృతి మరణవార్త తెలియగానే బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
 
రెండో లేన్‌లో రైలు రావడమే..

 సాధారణంగా ప్యాసింజర్ రైళ్లు, మెయిళ్లు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారంపై రావాల్సి ఉంది. తిరుపతి నుంచి ముంబై వెళ్లే రైళ్లు రెండో ప్లాట్‌ఫారంపై రావాలి. అయితే రైల్వే శాఖ వారు ముగ్గురాయి లోడు కోసం గూడ్సు రైలును ప్యాసింజర్ రైళు నిలబడాల్సిన ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారంపై నిలిపి లోడు చేయిస్తుండటంతో దాదర్ మెయిల్ మధ్యలో ఉన్న లైనుకు మళ్లించారు. అయితే ప్రయాణికులు రైలు నుంచి దిగేందుకు వెలుతురు లేకపోవడంతో కృతి కాలు జారి నిండు ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చిందని బంధువులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు