పోలీస్‌స్టేషన్‌లో హాజరైన నళిని

29 Jul, 2019 07:33 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్లో సంతకాలు చేస్తున్న నళిని

నళినితో మాట్లాడే అవకాశం దక్కని వీసీకే కార్యకర్తలు

చెన్నై, వేలూరు: మద్రాసు హైకోర్టు తీర్పుతో 30 రోజల పాటు ఫెరోల్‌పై వచ్చిన నళిని రెండో రోజున వేలూరు సత్‌వచ్చారి పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేసి తమ్ముడితో ఏకాంత ప్రదేశంలో రహస్యంగా మాట్లాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్‌ జైలులో నళిని శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు కోసం ఫెరోల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 30 రోజుల పెరోల్‌ మీద నళిని సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న తమిళ్‌ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్‌ ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. 30 రోజుల పాటు సత్‌వచ్చారిలోని పోలీస్‌ స్టేషన్లో నళిని సంతకం చేయాలని నిబంధన ఉండడంతో మూడవ రోజైన ఆదివారం ఉదయం సత్‌వచ్చారి పోలీస్‌ స్టేషన్‌లో సంతకాలు చేశారు.

వీసీకే నేతలు మాట్లాడేందుకు నిరాకరణ: నళినితో కలిసి మాట్లాడేందుకు వీసీకే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నయ అరసు వేలూరులోని నళిని ఇంటి వద్దకు చేరుకున్నారు, అయితే కోర్టు అనుమతి లేనిది ఎవరినీ మాట్లాడేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం విన్నయరసు విలేకరులతో మాట్లాడుతూ ఇదే కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని ఫెరోల్‌పై విడుదల చేసేందుకు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము ప్రస్తుతం నళినితో మాట్లాడేందుకు వచ్చామని అయితే కోర్టు అనుమతి లేకపోవడంతో తిరిగి వెళుతున్నామన్నారు.

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని: 28 సంవత్సరాల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన నళినిని చూసేందుకు ఆమె తమ్ముడు భాగ్యనాథన్‌ కుమార్తెతో కలిసి నళిని ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు గురించి ఏకాంతంగా చర్చించారు. పోలీసు స్టేషన్‌ వద్ద కూడా ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు