సెల్‌ఫోన్‌ గేమ్స్‌తో ట్రాఫిక్‌ పోలీసుల కాలక్షేపం

23 Jan, 2019 13:08 IST|Sakshi

 న్యాయమూర్తి ఆవేదన

టీ.నగర్‌: ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా పోలీసులు సెల్‌ఫోల్‌లో ఆటలాడుతున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌.ఆనంద వెంకటేష్‌ మంగళవారం కేసులపై విచారణ జరుపుతూ వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున సెషన్స్‌ న్యాయవాది మహ్మద్‌ రియాజ్‌ హాజరయ్యారు. ఆయనతో న్యాయమూర్తి ఆనంద వెంకటేష్‌ మాట్లాడుతూ మంగళవారం ఉదయం హైకోర్టుకు వచ్చే దారి సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులను గమనించానని, వీరంతా ట్రాఫిక్‌ నియంత్రించకుండా సెల్‌ఫోన్లు చూడడంలోనే నిమగ్నమైనట్లు తెలిపారు. ఒక సిగ్నల్‌లో తన కారుతోపాటు అనేక కార్లు నిలిచిపోయాయని, అక్కడ గ్రీన్‌ లైట్‌ వెళగగానే ఒక మహిళ రోడ్డుకు అడ్డంగా పరుగెత్తిందని, దీన్ని గమనించకుండా పోలీసు సెల్‌ఫోన్‌ చూడడంలో నిమగ్నమైనట్లు తెలిపారు. అందుకు న్యాయవాది ఏ సిగ్నల్‌ అనేది చెబితే సంబంధిత అధికారులకు తెలుపుతానన్నారు. పోలీసుపై చర్యలకు తాను చెప్పడం లేదని న్యాయమూర్తి బదులిస్తూ ఇకనైనా పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు తెలపాలని, వీటిపై ఏ చర్యలు తీసుకున్నారో వచ్చే 30వ తేదీన తనకు తెలియజేయాలని న్యాయవాదికి ఉత్తర్వులిచ్చారు.

మరిన్ని వార్తలు