మహిళను విక్రయించిన బావ?

1 Jun, 2017 02:09 IST|Sakshi
గుజరాత్‌ తీసుకెళ్లి ఘాతుకం
 
బోథ్‌ : ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన లలితను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్‌ తీసుకెళ్లి అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్‌ మండలం సొనాలకు చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్‌కు చెందిన రమేశ్‌ కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజు వారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆమె బావ చౌహాన్‌ అర్జున్‌ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత సమాచారం తెలియకపోవడంతో సోదరుడు జగదీశ్‌ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు.

తన సోదరిని ఇచ్చోడకు చెందిన రేఖ, శారదలతో కలిసి అర్జున్‌ గుజరాత్‌లో అమ్మినట్లు తెలిసిందని జగదీశ్‌ పేర్కొన్నాడు. అయితే అర్జున్‌ తనకేమీ తెలియదంటున్నాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం తాగి తమ ఇంటికి వచ్చిన అర్జున్‌  దుర్భాషలాడి దాడికి యత్నించాడని వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్‌ చేసి తనను రూ.లక్షా 80వేలకు గుజరాత్‌లో అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్‌ పేర్కొన్నాడు. కాగా తన సోదరిని అర్జున్‌ గుజరాత్‌కు విక్రయించినట్లు బుధవారం నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మాత్రం అదృశ్యం కేసు నమోదు చేసినట్లు జగదీశ్‌ తెలిపాడు. 
మరిన్ని వార్తలు