నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి

29 Apr, 2019 11:34 IST|Sakshi

ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన అసైన్డ్‌ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించవద్దు. కనీసం చెట్ల నరికివేత, మట్టిని కూడా తొలగించవద్దు. అయితే, నింబంధనలకు విరుద్ధంగా డ్వామా అధికారులు నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్‌ భూముల్లో నిత్యం వందలాది మంది కూలీలతో భూమి చదును, కరకట్టల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేయిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కూలీల ద్వారా ఫార్మాసిటీ భూముల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 

యాచారం: నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 సర్వే నంబర్లల్లోని 600 ఎకరాలకు పైగా అసైన్డ్‌ భూములను అధికారులు ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించారు. అసైన్డ్‌ భూముల్లో పట్టాలు పొంది కబ్జాలో ఉన్న రైతులు, పట్టాలున్న రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. పరిహారం ఇవ్వడమేకాకుండా సేకరించిన పొలాల్లోని సర్వే నంబర్లలో ఉన్న రైతుల పేర్లు తొలగించి ఫార్మాసిటీకి చెందిన భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. భూసేకరణ చేసిన పొలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు  చేయొద్దు. ఈ నేపథ్యంలో యంత్రాంగం రక్షణ నిమిత్తం సేకరించిన భూములకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కాపలాగా నియమించింది. 

పరిహారం సరిపోలేదని రైతుల గగ్గోలు
ఫార్మాసిటీకి సేకరించిన భూములకు తమకు న్యాయమైన పరిహారం చెల్లించలేదని నక్కర్తమేడిపల్లి రైతులు వాదిస్తున్నారు. భూసేకరణ చట్టం నింబంధనలకు విరుద్ధంగా పరిహారం చెల్లించారని, పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాలకు పూర్తి పరిహారం ఇవ్వలేదని, రాళ్లు, రప్పలు, గుట్టల నెపంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కోత పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే వరకు సదరు భూములు తమవేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో న్యాయమైన పరిహారం ఇవ్వని పక్షంలో వచ్చే ఖరీఫ్‌లో పంటలు కూడా సాగుచేస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు