జూలై 20 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు!

30 Jun, 2017 08:17 IST|Sakshi

కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి  
సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. జూలై 20 నుంచి తరగతులను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. బుధవారం కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న 63,588 మంది విద్యార్థుల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. వారిలో 7,542 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7లోగా కాలేజీల్లో చేరనున్నారు.

జూలై 20 తర్వాత చివరి దశ కౌన్సెలింగ్‌..
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల ఆరో దశ కౌన్సెలింగ్‌ జూలై 29తో ముగియనుంది. నాల్గో దశ కౌన్సెలింగ్‌ నాటికి అంటే 20వ తేదీ తర్వాత రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. నేటి (శుక్రవారం) నుంచి ఈసెట్, వచ్చే నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఉన్నాయి. అలాగే ఈ కౌన్సెలింగ్‌ ప్రాసెస్‌ను చూసే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని సెట్స్‌ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 14 నుంచి 19 వరకు చేపట్టేలా షెడ్యూల్‌ చేసుకుంది. వీటన్నింటి నేపథ్యంలో మొదటి దశ కౌన్సెలింగ్‌లో మిగిలిన 8,254 సీట్ల భర్తీకి వచ్చే నెల 20వ తేదీ తరువాత చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది.

మరిన్ని వార్తలు