లక్ష మందికి ఆహారం

14 Feb, 2019 10:36 IST|Sakshi

నేడు ఫీడ్‌ ద నీడ్‌కు శ్రీకారం

ప్రేమికుల రోజువినూత్న ప్రయత్నం

లక్ష మందికి ఉచితంగాభోజనం  

జీహెచ్‌ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు సమాయత్తం

గచ్చిబౌలి:  గ్రేటర్‌ హైదరాబాద్‌లో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నారు. నగరంలోని పలు హోటల్‌ యజమానులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఆకలితో ఉన్నవారందరికీఆహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో నగరంలో బృహత్తరకార్యక్రమాన్ని లాంఛనంగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు. ఫీడ్‌ ద నీడ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఆహారాన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు,ఆటో స్టాండ్, నైట్‌ షెల్టర్లు, స్లమ్‌లు, మేజర్‌ ఆసుపత్రులు ఇతర రద్దీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించనున్నట్టు అడిషనల్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని అందించాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంస్థలు ఈ క్రింది ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్‌ 95421 88884, విశాల్‌ 96668 63435, పవన్‌ 98499 99018 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

ప్రేమికుల రోజన లక్ష మందికి భోజనం...
ప్రేమికుల రోజు అంటే అందరికీ ప్రేమ జంటలు గుర్తుకు వస్తాయి. కానీ ప్రేమికుల రోజున అన్నార్తుల ఆకలి తీర్చి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు అధికారులు. ఫీడ్‌ ద నీడ్‌లో భాగంగా వాటెంటైన్స్‌ డే స్పెషల్‌గా గురువారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష మంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని సర్కిళ్ల పరిధిలో అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థలు ఇందులో పాలుపంచుకుంటాయి. మిగిలిన ఆహరాన్ని పేదలకు అందించే దిశగా ప్రజలు కూడా ఆలోచిస్తారని అధికారులు భావిస్తున్నారు.  ఇప్పటికే 40 వేల భోజనాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. హోటళ్ల యాజమాన్యాలు కూడా సహకరిస్తున్నాయి.

త్వరలో యాప్‌....
ఫీడ్‌ ద నీడ్‌కు సంబంధించిన యాప్‌ను త్వరలో రూపొందిస్తామని శేరిలింగంపల్లి వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ హరి చందన దాసరి తెలిపారు. దీని ద్వారా మరింత మంది స్పందిస్తారన్నారు.

మరిన్ని వార్తలు