చెరువుకు చేరని ‘చేప’

15 Sep, 2018 10:38 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నత్తనడకన కొనసాగుతోంది. మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం  చుట్టింది. ఐదు జిల్లాల్లో మొత్తం 13.01 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.31 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యకారులకు అందించారు. చెరువుల్లో చాలా వరకు 20 రోజులక్రితం కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో చేప పిల్లల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది.
 
50 శాతం కూడా పంపిణీ కాలేదు.. 
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ మొదటి వారం వరకే చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సెప్టెంబర్‌ చివరి వారం వరకు సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యక్రమాన్ని సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 50 శాతం చేప పిల్లల పంపిణీ కూడా పూర్తి కాలేదు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 1.49 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 83 లక్షలు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2.16 కోట్ల చేప పిల్లలకుగాను 85 లక్షల చేపల పిల్లలు మహబూబాబాద్‌  జిల్లాలో 4.43 కోట్ల చేప పిల్లలకు 2.50 కోట్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2.13 కోట్లకుగాను 85 లక్షలు, జనగామ జిల్లాలో 2.80 కోట్ల చేపపిల్లలకుగాను 28 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు.

మండల కేంద్రాల్లో పంపిణీ.. 
చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఎవరు తక్కువ కోట్‌ చేస్తే వారికి అప్పగించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు హన్మకొండలోని భీమారం ఫిషరీస్‌  నిర్వాహకులతోపాటు కొండా సుష్మితాపటేల్, పట్టాభి చేప పిల్లల పంపిణీని దక్కించుకున్నారు.  భీమారం ఫిషరీస్‌ వారు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మెజార్టీ చెరువులకు పంపిణీ చేయాల్సి ఉండగా, మిగిలిన చెరువులతోపాటు వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు పట్టాభి, సుష్మితా పటేల్‌ చెరిసగం చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. పటాభికి వరంగల్‌లోని కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఫాం ఉండగా, కొండా సుష్మితా పటేల్‌కు గీసుకొండ మండలం వంచనగిరిలో ఫాం ఉంది. సదరు కాంట్రాక్టర్లు ఆయా మండల కేంద్రాలకు చేప పిల్లలను తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. 

సెప్టెంబర్‌ చివరికల్లా పంపిణీ పూర్తి చేస్తాం
జిల్లాలో ఎంపిక చేసిన అన్ని చెరువుల్లో సెప్టెంబర్‌ చివరికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తిచేస్తాం. మా శాఖ పర్యవేక్షణలో చేప పిల్లల పంపిణీ జరుగుతోంది. చేప పిల్లలు గతంలో నేరుగా చెరువుల్లో వదలడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. అందుకే ఫాం దగ్గరనే పంపిణీ చేస్తున్నాం.  – నరేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి 

మరిన్ని వార్తలు