డిసెంబర్‌ 17 నుంచి ‘పోలీస్‌’ దేహదారుఢ్య పరీక్షలు 

28 Oct, 2018 01:35 IST|Sakshi

ఈ నెల 29 నుంచి పార్ట్‌–2 దరఖాస్తులు

షెడ్యూల్‌ విడుదల చేసిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం విడుదల చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్‌ 17 నుంచి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మొత్తం 40 రోజుల పాటు ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ(పీఈటీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ద్వారా పార్ట్‌–2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చైర్మన్‌ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిట్‌ కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు బయోమెట్రిక్‌ వెరిఫికేషన్, కులధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటా సర్టిఫికెట్, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేయాలని పేర్కొన్నారు. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని తెలిపారు.  

మొత్తం 3,77,770 మంది ...: ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణు లు అయ్యా రని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

మరిన్ని వార్తలు