కరోనాతో ఒకేరోజు నలుగురు మృతి

20 May, 2020 04:55 IST|Sakshi

రాష్ట్రంలో 38కి చేరిన మరణాలు కొత్తగా 42 మందికి పాజిటివ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే నలుగురు మరణించారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. వారిలో బీపీ, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధుడు, న్యుమోనియాతో బాధపడుతున్న మరో 70 ఏళ్ల వ్యక్తితోపాటు ఊబకాయం, న్యుమోనియా సమస్యలతో బాధపడుతున్న 38 ఏళ్ల మహిళ, న్యుమోనియాతో బాధపడుతున్న మరో 68 ఏళ్ల స్త్రీ ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 38కి చేరింది. ఇక రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో 42 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. ఇందులో జీహెచ్‌ఎంసీకి చెందిన వారు 34 మంది ఉండగా, వలసదారులు 8 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది. తాజాగా కరోనా నుంచి 9 మంది కోలుకోగా, ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారు.

>
మరిన్ని వార్తలు