అమ్మమ్మ తోడుగా..

12 Dec, 2014 01:45 IST|Sakshi

తిమ్మాపూర్ : ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బారె చంద్రమణికి ఎల్‌ఎండీ రిజర్వాయర్ శివారులోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆర్థిక స్థితి బాగాలేనందున, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేమని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి సమక్షంలో రామకృష్ణకాలనీ సర్పంచ్ సారయ్య, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. కొంతకాలంగా రామకృష్ణకాలనీలో ఉంటున్న బారె చంద్రమణి, పొరండ్లకు చెందిన నీలం భాస్కర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చంద్రమణి మరణించిన విషయం తెలిసిందే.
 
 మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి ఆమె తల్లిగారి ఊరైన కాటారం మండలం దామెరకుంటకు పోలీ సులు సమాచారంమందించారు. చంద్రమణికి ఏడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉండగా రామకృష్ణాకాలనీ గ్రామస్తులే ఆలనాపాలనా చూశారు. మృతురా లి తల్లి మధునమ్మ, కుటుంబసభ్యులు బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకోగా ఆమె ఫిర్యాదు మేరకు గురువారం ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దామెరకుంటకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ ఆర్థికస్థితి బాగాలేదని చెప్పడంతో రామకృష్ణాకాలనీ సర్పంచ్ కిన్నెర సారయ్యతోపాటు గ్రామస్తులు కలి సి ఎల్‌ఎండీ శివారు లో ఖననం చేశారు. అప్పటి దాకా గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న మృతురాలి పిల్లలు మనోహర్(5), రమ్య(7)ను అంత్యక్రియల సమయంలో అక్కడికి తీసుకురాగా అమ్మమ్మను, మామయ్యను చూసి పిల్లలు విలపించారు. పిల్లల పరిస్థితి చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అంత్యక్రియల అనంతరం పిల్లలిద్దరూ అమ్మమ్మతో వెళ్లిపోయారు.
 
 జీవితంపై విరక్తిచెంది...
 భాస్కర్ ఇంట్లో గొడవల కారణంగా అతనితోపాటు తన కూతురు చంద్రమణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మధునమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రమణికి 2007 లో పోచమల్లుతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు. గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటినుంచి పిల్లలిద్దరినీ చంద్రమణి తీసుకుని పొరండ్లకు వచ్చి కూలీ పని చేసుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పొరండ్లకే చెందిన నీలం భాస్కర్‌తో కలిసి రెండేళ్ల నుంచి రామకృష్ణకాలనీలో ఉంటోందని, ఇదే సమయంలో భాస్కర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలియడంతో జీవితంపై విరక్తి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని, తన కూతురు చికిత్స పొందుతూ మరణించిందని మధునమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు