చెరువులన్నీ కళకళలాడాలి 

16 Feb, 2019 03:29 IST|Sakshi

అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్‌ 

మిషన్‌ కాకతీయ–చిన్న నీటి వనరులపై సమీక్షలో ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయతో కాకతీయుల నాటి చెరువులకు  పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులన్నీ నిండి కళకళలాడినప్పుడే మిషన్‌ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి వారం రోజు ల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో మిషన్‌ కాకతీయ, చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, నీటి పారుదల ఈఎన్‌సీ మురళీధర్‌ రావు, కాడా కమిషన్‌ మల్సూర్, సీఈ శ్యాంసుందర్, కాడా డీడీ స్నేహ, రిటైర్డ్‌ ఈఎన్సీ విజయ్‌ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే ఈ సమీక్షలో పాల్గొన్నారు.  

ఫీడర్‌ చానల్స్‌ సిద్ధం చేయాలి... 
ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ..  ‘ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు  పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేవి. 1974లో నే అప్పటి బచావత్‌ అవార్డు ప్రకారం.. తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉంది. ఈ చెరువులు నాశనమయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకు న్నారు. అయినా పంటలు కూడా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది’అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.  ‘తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్‌ కాకతీయ కార్యక్రమం తీసుకొచ్చాం. చెరువులను బాగు చేసుకున్నాం.

ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే ఈ పథకానికి సార్థకత. ప్రస్తుతం నిర్మి స్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ల తో చెరువులు నింపాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్‌ కెనాల్స్‌ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంజనీ రింగ్‌ అధికారులతో వర్క్‌ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో చెరువుల్లో, చెక్‌ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని  లెక్క తీయాలని అధికారులకు సూచించారు. 

మరిన్ని వార్తలు