ఓటు నమోదుకు కేటీఆర్‌ దిశానిర్దేశం

28 Dec, 2018 19:54 IST|Sakshi
కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నూతన ఓటర్ల చేరిక, ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ పైన చురుగ్గా పని చేయాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నాయకులకు టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఓటర్ల జాబితాలోని సవరణలపైన చర్చించారు. ఎలక్షన్ కమిషన్ మరో నెల రోజుల పాటు కొత్త ఓట్ల నమోదు, గత జాబితాలో మిస్సయిన ఓటర్ల నమోదు వంటి అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం కేంద్రంగా అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ శ్రేణులను ముందుకు తీసుకుపోవాలన్నారు.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున ఓటర్లను జాబితాలో  చేర్చాలన్నారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారంతా పార్టీ ప్రధాన కార్యదర్శులతో కలిసి ఈ నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతోపాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులతోనూ పార్టీ కార్యదర్శులు నేరుగా మాట్లాడుతూ ఈ మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. 

నూతన ఓటర్ల నమోదు,యు సవరణ ప్రక్రియను  పర్యవేక్షించేందుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజులకోసారి ఎంతమంది ఓటర్లను నమోదు చేయించేందుకు దరఖాస్తులు సమర్పించారు.. వాటి తాలూకు జిరాక్స్ ప్రతులను కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. దీంతోపాటు ప్రతిరోజు ఎంత మంది దరఖాస్తులను నమోదయ్యేలా చేశారు..వాటి గణాంకాలను కూడా పంపాలన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారనీ తెలిపారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భవనాల నిర్మాణం సంబంధించిన ప్రక్రియపైన కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

ప్రభుత్వం అనుమతించిన మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం మేరకు స్థలాన్ని సేకరించేందుకు అవకాశం ఉందని, ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. ఈ స్థలాలు ఖరారు చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. వచ్చే వారం రోజుల్లోగా స్థలాలకు అవసరమైన డబ్బులను పార్టీ చెల్లిస్తుందని, వారం రోజుల్లోగా వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. 

మరిన్ని వార్తలు