సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగరలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి చిరుత గగన్పహాడ్ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ, పోలీసు అధికారులు.. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఫుట్ ప్రింట్స్ ఆధారంగా అది అడవిలోని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగినట్టుగా గుర్తించారు. దాని ఆచూకీ కనుగోనడానికి.. ఆ పరిసరాల్లో 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, ఈ నెల 14న ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే చిరుత సంచరించిన సంగతి తెలిసిందే. దాని ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా చిరుత కదిలికలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 15 రోజులుగా చిరుత అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.