కొత్త కలెక్టర్‌గా లోకేష్‌ కుమార్‌

29 Aug, 2018 08:37 IST|Sakshi
లోకేష్‌ కుమార్‌, రఘునందన్‌రావు

రఘునందన్‌రావు హైదరాబాద్‌కు బదిలీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  జిల్లా నూతన కలెక్టర్‌గా డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘకాలం మన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రఘునందన్‌రావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లోకేష్‌ కుమార్‌ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఈయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. భార్య విజయేంద్ర కూడా ఐఏఎస్‌ అధికారే. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన కలెక్టర్‌గా లోకేష్‌ కుమార్‌ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా, 2015 జనవరి 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునందన్‌రావు మూడున్నరేళ్లపాటు పనిచేశారు. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన కలెక్టర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ ఆయన కీలక భూమిక పోషించారు. 

సంతృప్తితో వెళ్తున్నా..  

హైదరాబాద్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందిన రఘునందన్‌రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే జనవరిలో అమెరికాకు వెళ్లనున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో తాను  సంతృప్తిగా పనిచేశానని చెప్పారు. ‘కలెక్టర్‌గా జిల్లాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం ఎనలేని సంతృప్తినిచ్చింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల నుంచి మంచి సహకారం లభించింది. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచారు’ అని రఘునందన్‌రావు తెలిపారు. 

మరిన్ని వార్తలు