శభాష్‌.. సాయి

8 Jul, 2019 11:00 IST|Sakshi

78 ఏళ్ల వయసులోనూ కాలనీ సంక్షేమమే లక్ష్యం కోసం..

నిత్యం సామాజిక సేవలో పౌర సమస్యలపై పాలకులకుసూటిగా ప్రశ్నలు..

మోడల్‌కాలనీ ప్రధాన కార్యదర్శి జేఎస్‌టీ సాయి నైజం...

సనత్‌నగర్‌: వృద్ధాప్యానికి వయస్సు ఉంటుందేమో గానీ..మనస్సుకు కాదంటూ ఆ ఏడు పదుల వ్యక్తి నిరూపిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నవ యువకుడిలా కాలనీ అభివృద్ధికి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వర్తిస్తుంటారాయన. ఆయనే మోడల్‌కాలనీకి చెందిన జేఎస్‌టీ సాయి.

చిట్టాతో రెడీ...
రాష్ట్ర మంత్రో, ప్రజాప్రతినిధో...లేక అధికారో...మోడల్‌కాలనీ వైపు వస్తున్నారంటే చాలు...ఆ వ్యక్తి సమస్యల చిట్టాతో రెడీగా ఉంటాడు. అవి సొంత సమస్యలేమీ కాదు.. అన్నీ ప్రజా సంక్షేమంతో ముడిపడినవే.  ఇక రెగ్యులర్‌గా సమస్యలపై అధికారులతో ఫోన్‌లో టచ్‌లో ఉంటుండడం ఆయన దినచర్యలో ఒక భాగం. ఆ వ్యక్తి వస్తున్నా...లేదా ఫోన్‌న్‌ చేస్తున్నా...మళ్ళీ ఏ సమస్యను మోసుకొస్తున్నారంటూ అని వ్యంగ్యంగా అనే అధికారులూ లేకపోలేదు. తాను ఉండే కాలనీ ప్రజల సంక్షేమం. అభివృద్ధి గురించి ఆయనలోని తపనకు ఇదో ఉదాహరణ. ఇది నాణేనికి ఒక వైపు అయితే... ఆయనలోని సామాజిక కోణం మరోవైపు...తానుండే కాలనీ వారితో కలిసి మానవ సేవా సమితి పేరిట సమాజహిత కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఆయనలోని ఇంకో కోణం ఏమిటంటే సినీ అభిమాని అయిన ఆయన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తనలోని కళాభిమానాన్ని చాటుతుంటారు. ఇవన్నీ చేయాలంటే ఉరకలెత్తే రక్తమే ఉండనక్కర్లేదు..అనుభవాలను ధారపోసే సీనియర్‌ సిటిజ¯Œన్స్‌ కూడా చేయవచ్చని నిరూపిస్తున్నారు 78 ఏళ్ళ జేఎస్‌టీ సాయి. ఆ ప్రాయంలోనూ సామాజిక సేవా కార్యకర్తగా, కాలనీ అభివృద్ధి బాధ్యతలను, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–10 ఆసరా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఓపిగ్గా  కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

స్వచ్ఛ కాలనీ అవార్డు రావడంలో ప్రధాన భూమికగా...
ఒకప్పుడు మోడల్‌కాలనీ పార్కు చూస్తే చెట్లపొదలతో చిట్టడివిని తలపించేలా ఉండేది. దాని అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి  పార్కును సర్వాంగసుందరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడానికి కారకులుగా నిలిచారంటే ఆయనలోనే తపనకు నిదర్శనం. ఆ పార్కు నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. అలాగే రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతెందుకు రోడ్డుపై చెత్త, చెట్ల కొమ్మలు ఉన్నా వెంటనే అధికారులకు ఫోన్‌న్‌ చేయడమో! లేక నేరుగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడమో చేసి పరిష్కారం జరిగే వరకు వెంటపడుతుండడం. ఒకానొక దశలో అధికారులు సైతం విసుగెత్తిపోయి సమస్య పరిష్కారించి తీరక తప్పదు. అందుకేనేమో ఆ కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు వరించింది.

ఐక్యతే బలం నినాదంతో...
ఇక వినాయక చవితి, స్వాతంత్య్ర, గణతంత్ర, కార్తీక మాస విశిష్ట పూజలు, వనభోజనాలు...ఇలాంటి కార్యక్రమాలను కాలనీవాసులందరినీ భాగస్వాములు చేసి ఒకే వేదిక పైకి చేర్చి ఐక్యతలో ఉండే శక్తిని చాటిచెబుతారు. ఆయా పండుగ వేళల్లో ఉల్లాసభరిత కార్యక్రమాలతో మనస్సును పరవశింపజేసే కార్యక్రమాల నిర్వహణలో రాజీపడరంటే అతిశయోక్తి కాదు. ఇక సహపంక్తి భోజనాలు,   ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాల నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో పిల్లలకు ఆటలు, పాటలు, వ్యాసరచన, వక్తత్వ , పెయింటింగ్‌ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఆనవాయితీ.

ఓటు విలువపై విస్తృత ప్రచారం...
ఓటు హక్కు...ప్రజల తలరాతలను మార్చే ఆయుధంగా జేఎస్‌టీ సాయి భావిస్తారు. అందుకే ఎన్నికల వేళ ఓటు విలువను తెలియపరుస్తూ ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి ఓటు హక్కు వినియోగించుకోవాలని  ప్రచారం కల్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

మానవసేవా సమితితో సేవలకు నాంది
కాలనీకి చెందిన బుచ్చిబాబు,  శశికాంత్‌లతో పాటు మరికొంతమందితో కలిసి మానవ సేవా సమితి తరుపున జేఎస్‌టీ సాయి వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. వేసవికాలంలో దాదాపు రెండు నెలల పాటు బాటసారులకు పెరుగన్నం, మజ్జిగ,  మంచినీటిని అందిస్తున్నారు.  దీంతో పాటు నిత్యం ఎర్రగడ్డ మానసిక  ఆస్పత్రికిలోని రోగుల సహాయకుల కు అన్నదానం చేస్తుంటారు. సత్యసాయి సేవా సమితి తరుపున జరిగే వివిధ కార్యక్రమా ల్లో జేఎస్‌టీ సాయి చురుగ్గా పాల్గొంటూ తనలోని సేవానిరతిని చాటుతున్నారు. అలాగే విద్యావ్యాప్తిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నోట్‌ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు.

కళాకారులకు ప్రోత్సాహం...
ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌న్‌ ప్రతినిధిగా జేఎస్‌ టీ సాయి కళాకారులు అంటే అపారమైన గౌర వం. అందుకే కాలనీలో సామూహికంగా ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారులను చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో వారి చేత ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇప్పిస్తుంటారు. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యం తో స్వయంగా సుమధుర కళానికేతన్‌ను స్థాపిం చి జానపద, కూచిపూడి, భరతనాట్యం, నాటిక, నాటక, అవధానాలు, సంగీతం, మిమి క్రీ వంటి కార్యకమాలు నిర్వహించి తనలోని కళాతృష్ణను తీర్చుకుంటూనే ప్రజలకు వినో దాన్ని అందిస్తున్నారు. శ్రీవిశ్వనాధం సాహిత్య పీఠం జాయింట్‌ సెక్రటరీ, శ్రీనాటరాజ ఆర్ట్‌ అకాడమీ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ, కష్ణ కళాభారతి కార్యదర్శిగా, సుమధుర కళానికేతన్‌ ఫౌండర్‌ సెక్రటరీగా, విద్వత్‌ పరిషత్‌ కన్వీనర్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సాంస్కృతిక రంగంలో తనదైన సేవలు అందించారు.

సీనియర్‌ సిటిజన్స్‌కు ‘ఆసరా’...
తోటి సీనియర్‌ సిటిజన్స్‌ నిత్యం ఉల్లాసంగా ఉండాలని జేఎస్‌టీ సాయి తాపత్రయం. అందుకోసం జీహెచ్‌ఎంసీ నుంచి వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు వారికి సంబంధించిన స్కీములను వినియోగించుకునేలా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు.   

ఎన్నో అవార్డులు..రివార్డులు.. మరెన్నో సన్మానాలు...
మోడల్‌కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు దక్కించుకోవడం వెనుక జేఎస్‌టీ సాయి కాలనీ పరిశుభ్రత విషయంలో కీలక భూమిక వహించారు.
ఎల్డర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ రివార్డు.
సీనియర్‌ సిటిజన్స్, సంఘ సేవకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌చే అవార్డు, సన్మానం.
సామాజిక సేవలకు గానుఎకోష్యూర్‌ ఎక్సలెన్స్‌ అవార్డు
సంఘ సేవకు గాను ఖమ్మం మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసరావుచే సత్కారం..

మరిన్ని వార్తలు