20 సేవలకు ఇకపై ఆన్లైన్లోనే అనుమతులు
మార్చి నుంచి అమలుకు ఆర్టీఏ సన్నాహాలు
ఇంటి నుంచే రవాణా శాఖ సేవలను పొందే చాన్స్
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ ఆన్లైన్ బాటపడుతోంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్లైన్ బిడ్డింగ్ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ.. మరిన్ని సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావలసిన అవసరంలేని సేవల్ని గుర్తించి ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదుకే అవకాశం ఉంది. ఒకసారి స్లాట్ (సమయం,తేదీ) నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్బ్యాంకింగ్ లేదా ఈ సేవ కేంద్రా ల్లో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌరసేవలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధ్రువీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే.. వారు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. ఇందుకోసం నెట్బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణాశాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్లైన్ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు.
ఆన్లైన్ సేవలివే..
డాక్యుమెంట్లే కీలకం
ఆన్లైన్ సేవల్లో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాహనం ఫొటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలనూ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ‘ఫొటోలకు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల సెల్ఫీ అప్లోడ్ చేయడమా లేక, ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నాం’అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు.