మింగింది కక్కాల్సిందే...

14 Dec, 2019 10:53 IST|Sakshi

గ్రామ పంచాయతీల్లో18 ఏళ్ల ఆడిటింగ్‌ పూర్తి

మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శులకు నోటీసులు

జారీచేస్తున్న ఆడిట్‌ అధికారులు

స్వాహా అయిన నిధులు రూ.64.06 కోట్లు

సాక్షి, మోర్తాడ్‌(నిజామాబాద్‌) : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులకు ఆడిట్‌ అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు. 2001 నుంచి 2018 వరకు పంచాయతీల ఆడిట్‌ను ఇటీవల పూర్తి చేసిన అధికారులు నిధులు పక్కదారి పట్టిన పంచాయతీలను గుర్తించి నోటీసులు అందిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి గడచిన ఏడాది వరకు వివిధ పీరియడ్‌లలో సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి కార్యదర్శులుగా పని చేసిన ఉద్యోగులలో బాధ్యులు ఎవరు ఉంటే వారికి నోటీసులు ఇవ్వాలని ఆడిట్‌ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పంచాయతీల పునరి్వభజన జరుగకముందు 393 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

ఈ అన్ని పంచాయతీల్లో ఆడిట్‌ అధికారులు జమా ఖర్చుల వివరాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన ఆంశాలను గుర్తించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలా జిల్లాలో 50,346 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఈ అభ్యంతరాలకు సంబంధించి మొత్తం రూ.64.06 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌జీఎఫ్, ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ల ద్వారా నిధులు కేటాయించేవి. అలాగే తలసరి నిధులతో పాటు పంచాయతీలకు ఇంటి పన్నులు, నీటి కుళాయి బిల్లులు, లైసెన్స్‌ల జారీ, తైబజార్‌ వేలం వల్ల కూడా ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ఖాతాలు, జనరల్‌ ఫండ్‌ ఖాతాల ద్వారా జరిపిన చెల్లింపులను ఆడిట్‌ అధికారులు పరిశీలించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డు సరిగా ఉన్నవాటిని మినహాయించి సరైన రసీదులు లేకుండా నిధులు ఖర్చు చేసిన వాటిపై అధికారులు ఆడిట్‌లో అభ్యంతరం తెలిపారు. 

మరిన్ని వార్తలు