ఫేస్‌బుక్‌ పరిచయం..వాట్సప్‌ చాటింగ్‌

15 Aug, 2018 16:37 IST|Sakshi
బాక్స్‌లో పంపిస్తున్నట్లు  వాట్సప్‌లో వచ్చిన  ఫొటోలు  

ఆన్‌లైన్‌లో కొత్తరకమైన మోసాలు..

గిఫ్టునాది.. ఖర్చునీది..విదేశీ యువతి టోకరా విఫలం

‘ఖని’లో వెలుగుచూసిన ఘటన

జ్యోతినగర్‌(రామగుండం) : పెరుగుతున్న టెక్నాల జీ ఆన్‌లైన్‌ మోసాలు  మరింత సులువు అయ్యేలా చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్న విదేశీ యువతి తనకు బహుమతులు పంపిస్తున్నాని, దానికి సంబంధించిన కస్టమ్స్‌ చెల్లించాలని కోరింది. ఇది మోసంగా గమనించి సదరు వ్యక్తి యువతి వేసిన వలకు చిక్కకుండా బయటపడ్డాడు. 

ఇదీ జరిగింది.. 

ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన యువతి పరిచయమైంది. కొద్దిరోజుల పాటు ఒకరికొకరు సందేశాలు పంపుకున్నారు. తరువాత సదరు వ్యక్తిని విదేశీ యువతి ఫోన్‌ నంబర్‌ అడిగింది. దీంతో ఇద్దరూ వాట్సప్‌లో చాటింగ్‌ చేసుకోవడం ఆరంభించారు. ఇలా ఆ వ్యక్తి ‘ఖని’లోని తన ఇంటి అడ్రస్‌ను విదేశీ యువతికి వెల్లడించారు.

ఈ క్రమంలో ఒకరోజు తన పుట్టినరోజు అని ‘నీకు గిఫ్టుపంపిస్తున్నా.. స్వీకరించాలి.’ అని చాటింగ్‌ చేసింది. అందులో ఆపిల్‌ఫోన్, బంగారుగొలుసు, ల్యాప్‌టాప్, షూ, గడియారం తదితర వస్తువులు సుమారు 50,000 వేల బ్రిటీష్‌ఫౌండ్లు పంపిస్తు న్నట్లు తెలిపింది. సంబంధిత ఫొటోలు, కొరియర్‌రశీదు వాట్సప్‌ కూడా చేసింది. ఈనెల 11న స్వైప్‌ ఎక్ర్‌ప్రెస్‌ కొరియర్‌ పేరుతో ఓ రశీదును పంపిస్తూ.. 13న ‘ఖని’ చేరుతుందని సందేశం పంపింది. 

అసలు టోకరా ప్రారంభం ఇలా.. 

ఇంతలో మరో సందేశం పంపింది. ‘ మీకు పార్సిల్‌ పంపే క్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. గిప్ట్‌ప్యాక్‌ తీసుకునేప్పుడు కస్టమ్స్‌ కింద రూ.36,900 చెల్లించాలి’ అని తెలిపింది. దీంతో సదరు వ్యక్తికి అనుమానం వచ్చింది. తన దగ్గర అంత మొత్తంలో లేవని తేల్చిచెప్పాడు. 13వ తేదీన పార్సిల్‌ వచ్చినట్లు ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.36,900 చెల్లించి తీసుకెళ్లమనడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే సదరు యువతి వాట్సప్‌ నంబర్‌ బ్లాక్‌చేసి, ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్‌ చేశాడు.

మరిన్ని వార్తలు