ప్రాణదీప్‌- సౌజన్య ప్రేమకథ సుఖాంతం

21 Jun, 2018 18:01 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. రెంజల్‌ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో ఐదు నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా ఆర్య సమాజ్‌కు చేరుకున్న సౌజన్య బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లి కొడుకు స్నేహితులు పోలీసులకు ఫోన్‌ చేయగా.. వారు అక్కడికి చేరుకునేలోపే బంధువులు సౌజన్యను మక్లూరుకు తీసుకెళ్లారు.  

వెంటనే మక్లూరు వెళ్లిన టూ టౌన్‌ పోలీసులు బాధిత యువతిని కలిశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సెక్షన్‌ 365 కింద కుటుంబ సభ్యులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏసీపీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్‌ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరినీ టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా 24 గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం పోలీసుల సహకారంతో చివరికి ప్రేమజంట ఒక్కటి కానుంది.

మరిన్ని వార్తలు