ప్రతాప్‌.. మళ్లీ పోలీస్‌

14 May, 2020 07:04 IST|Sakshi

కానిస్టేబుల్‌ అంటే పెళ్లి కావటం లేదని రాజీనామా

బిజినెస్‌ అని చెబితే రాని మంచి సంబంధాలు

తీరా పోలీస్‌ ఉద్యోగమే భేష్‌ అంటూ తిరిగి చేరిక

సాక్షి, సిటీబ్యూరో: అతను చదివింది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌. చేరింది నగరంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగంలో. ఆపై పెళ్లి సంబంధాలు చూస్తే.. కానిస్టేబులా.. అంటూ తీసి పారేస్తున్నారనే మనస్తాపంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గత ఏడాది వార్తల్లోకెక్కిన చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ ప్రతాప్‌.. మళ్లీ పోలీస్‌ ఉద్యోగంలో చేరారు. విశాఖ జిల్లా కొత్తవలసకు చెందిన ప్రతాప్‌ తండ్రి ఈశ్వర్‌రావు చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. పాల వ్యాపారం చేస్తూ ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని బాగా చదివించారు.

ఇంజినీరింగ్‌ అనంతరం ప్రతాప్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్‌ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు. ఆపై బిజినెస్‌ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయతాల్లో పెళ్లి సంబంధాలు చూసినా కలిసి రాకపోవటంతో మళ్లీ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని పెట్టుకున్న అర్జీని అధికారులు ఓకే చేయటంతో.. ప్రతాప్‌ మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుత పోస్టింగ్‌ చార్మినార్‌ పీఎస్‌లో అయినా.. డీపీజీ కార్యాలయంలో కంప్యూటర్‌ విభాగంలో డిప్యుటేషన్‌లో పనిచేస్తున్నారు. తన కుమారుడు మనసు మార్చుకుని మళ్లీ ఉద్యోగంలో చేరటం సంతోషంగా ఉందని ఆయన తండ్రి ఈశ్వర్‌రావు చెప్పారు.(కనీసం.. పిల్లనివ్వడం లేదు)

మరిన్ని వార్తలు