ఆర్టీసీ పరిరక్షణకు 17న సబ్బండ వర్గాల మహాదీక్ష 

13 Nov, 2019 03:50 IST|Sakshi
అభివాదం చేస్తున్న మందకృష్ణ మాదిగ, రాములు నాయక్‌ తదితరులు..

30న హైదరాబాద్‌ దిగ్బంధం

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

పంజగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీని అమ్ముకునేందుకు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు దాన్ని కాపాడుకునేందుకు చూస్తున్నారు. అందుకే న్యా య వ్యవస్థతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లభిస్తోంది’అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కార్మిక వర్గాలు, పేద వర్గాలను అణగదొక్కేందుకు చూస్తున్న వారికి చెమటలు పట్టించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. 17న వేలాది మందితో ఇందిరాపార్క్‌ వద్ద ‘సబ్బండ వర్గాల మహాదీక్ష’, 18న ఆర్టీసీ జేఏసీ సడక్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు, 20న గవర్నర్‌ను కలసి ఆర్టీసీ ప్రైవేటీకరణతో పేదవర్గాలకు జరిగే నష్టంపై వివ రణ, 30న నాలుగు లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని తెలిపారు.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్, సామాజిక వేత్త జేబీ రాజు, మాజీ మంత్రి రవీంద్రనాయక్, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రకుమార్, రాములు నాయక్‌ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు