టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

24 Feb, 2020 11:05 IST|Sakshi

తనను తిట్టి కొట్టిన వ్యక్తిని పిలిపించాలని డిమాండ్‌

లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హంగామా

సముదాయించి కిందికి దిగేలా చేసిన పోలీసులు, స్థానికులు

కుటుంబ సభ్యులకు అప్పగింత 

సాక్షి, కౌడిపల్లి(మెదక్‌) :  తనను దూషించడంతోపాటు కొట్టిన వ్యక్తిని పిలిపించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కరెంట్‌ టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ  ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన పాత్‌లోత్‌ జగన్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట జాతీయ రహదారి పక్కన ఉన్న 33/11కేవీ కరెంట్‌ టవర్‌ ఎక్కాడు. అతను టవర్‌ ఎక్కడం గమనించిన స్థానిక పండ్ల వ్యాపారులు పోలీసులకు తెలియజేయడంతో విద్యుత్‌శాఖ అధికారులకు ఫోన్‌చేసి పవర్‌ ఆఫ్‌ చేయించారు. శివరాత్రి రోజు రాత్రి గ్రామంలో గ్రామపంచాయతీ తరఫున ట్యాంక్‌ ద్వారా నీటిని సరఫరా చేసేటప్పుడు తమ ఇంట్లో నీళ్లు లేవని పోయాలని ట్యాంకర్‌ వెంట ఉన్న వార్డు సభ్యుడు రెడ్డి రాజును జగన్‌ కోరాడు.  

కాగా అందరికీ పోసినట్లుగానే మీకు పోస్తామని తెలిపాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు రాగా నచ్చజె ప్పి పంపించారు. నీళ్లుపోయమంటే  తనను వా ర్డు సభ్యుడు తిట్టడంతోపాటు కొట్టాడని చెబు తూ జగన్‌ కరెంట్‌ టవర్‌ ఎక్కాడు. వార్డు సభ్యు డు రెడ్డి రాజును  పిలిపిస్తేనే దిగుతానన్నాడు.  కాగా అతను అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు.  స్థానిక ఎస్‌ఐ రాజ శేఖర్, పోలీసులతోపాటు స్థానికులు టవర్‌ దిగాలని చెప్పినా వినిపించుకోలేదు.  దీంతో చేసేదిలేక వార్డు సభ్యుడు రెడ్డిరాజును తీసుకొచ్చారు. సుమారు అరగంట సమయం తరువాత పోలీసులు, స్థానికులు నచ్చజెప్పడంతో మంచినీళ్ల కోసం దిగిరాగా పోలీసులు పట్టుకుని కిందకు దించారు. నీళ్లు పోయాలని అడిగితే తిట్టి కొట్టారని తనతో క్షమాపన చెప్పించాలని చెప్పడంతో వార్డుసభ్యుడితో క్షమాపన చెప్పించారు. మరోసారి ఇరువురి మధ్యలో ఎలాంటి గొడవ జరుగకుండా ఉండాలని సూచించారు. అనంతరం పోలీసులు జగన్‌ తల్లి శారదతోపాటు కుటంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించి పంపించారు.  

మరిన్ని వార్తలు