సుప్రీంకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్

9 Dec, 2014 03:10 IST|Sakshi

* డీఎస్సీ-1998 కేసు ఫిబ్రవరికి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్: డీఎస్సీ -1998 ఉత్తీర్ణులు దాఖలు చేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులకు ఉద్యోగాలివ్వాలని కింది కోర్టు చెప్పినప్పటికీ  అమలుచేయక పోవడంతో కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం గతంలో  ప్రభుత్వాన్ని ఆదేశించినా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో స్వయంగా సీఎస్ హాజరుకావాలని గత నవంబర్‌లో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సోమవారం రాజీవ్‌శర్మ కోర్టుకు వచ్చారు. సదరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని,వారి కంటే తక్కువగా మార్కులు వచ్చిన వారెవరికీ ఉద్యోగాలివ్వలేదని తెలిపారు. పైగా ఆ అభ్యర్థుల వయస్సు యాబై ఏళ్లకు వచ్చిందన్నారు. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించగా, పొరపాటైందని, ఇకపై పునరావృతం కాదని సీఎస్ వివరణ ఇచ్చారు. దీంతో కేసును ఫిబ్రవరి మొదటివారానికి వాయిదా వేశారు.
 

>
మరిన్ని వార్తలు