కౌలు రైతులపై కరుణేదీ!

17 Jun, 2019 12:44 IST|Sakshi

తాండూరు: ఏ ఆధారమూ లేని కౌలు రైతులపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. నేలతల్లిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని పంటలు సాగు చేస్తూ ఏటా నష్ట పోతున్న తమను ఆదుకునేందుకు సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. 80 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధార పడి జీవనం సాగిస్తారు. జిల్లాలో భూములున్న పట్టాదారులు వరుస నష్టాలను చవిచూసి, పొలం పనులు చేయలేక తమ భూమిని కౌలుకు ఇస్తున్నారు.

ముందుగానే వచ్చిన కౌలు డబ్బులను తీసుకొని ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రతీ మండలంలో ఈ విధానం కొనసాగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో సుమారు పదుల సంఖ్యలో కౌలు రైతులు పొలాలను లీజుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఇలా సుమారు 20వేల మంది.. సుమారు లక్ష ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వీరిని కౌలు రైతులుగా గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి, కంది, పెసర, మినుము పంటలను వేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే కౌలుకు తీసుకున్న రైతులు పెట్టిన పెట్టుబడికి కొంత వరకు లాభాలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే కష్టాల్లో కూరుకుపోతున్నారు.  

కౌలు రైతులకు వర్తించదు  
కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తించదు. వీరికి పథకాలు అందేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు అందలేదు. కౌలు రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు అందించాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కౌలు రైతుల కోసం ప్రభుత్వం ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెడితే అమలు చేస్తాం.  – గోపాల్, వ్యవసాయాధికారి   

మరిన్ని వార్తలు