ఫీవర్‌ ఆస్పత్రిలో 3 కరోనా కేసులు!

27 Jan, 2020 04:40 IST|Sakshi

నల్లకుంట: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్‌ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేటెడ్‌) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేశారు. అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

బ్లిహిల్స్‌కు చెందిన నాగార్జునరెడ్డి కుమారుడు అమర్‌నాథ్‌ రెడ్డి(25) ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురై అతను శనివారం రాత్రి ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడిని పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్‌ వార్డులో అతడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో 2 అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఐసోలేటెడ్‌ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. వీరికంటే ముందు గా పది రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విద్యార్థి దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యాడు. కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఆ విద్యార్థి ఫీవర్‌ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షల్లో సాధారణ ఫ్లూగా తేలింది. అతడికి చికిత్స చేసి ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు.

మరిన్ని వార్తలు