అద్దెబతుకు.. శ్మశానమే దిక్కు!

25 Mar, 2018 02:15 IST|Sakshi
శ్మశానంలో తులసవ్వతో కుటుంబసభ్యులు ∙ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తులసవ్వ

     చనిపోతే అరిష్టమన్న యజమాని కొనఊపిరితో వృద్ధురాలు

     శ్మశానానికి తరలించిన కుటుంబ సభ్యులు

సిరిసిల్లటౌన్‌:  కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలు చనిపోతే తమ ఇంటికి అరిష్టమని ఇంటి యజమానులు చెప్పడంతో బతికుండగానే ఓ అవ్వను కుటుంబ సభ్యులు శ్మశానానికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక ప్రగతినగర్‌కు చెందిన గుంటుకు తులసవ్వ(85) భర్త వెంకటి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. తులసవ్వకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు లలిత షోలాపూర్‌లో ఉంటుండగా పెద్దకూతురు శోభ వద్ద ఆమె ఉంటోంది.

ప్రగతినగర్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉంటున్నారు. ఆర్నెల్లుగా తులసవ్వ అనారోగ్యం బారినపడగా పేదరికంలో ఉన్న కూతురు చేతిలో డబ్బు లేక సరైన వైద్యం చేయించలేకపోయింది. మూడురోజులుగా తులసవ్వ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఇంటి యజమాని శ్రీనివాస్‌.. శనివారం మధ్యాహ్నం వృద్ధురాలితోపాటు ఆమె కూతురును తన ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో వేరే దారిలేక కూతురు శోభ తల్లితోపాటు శ్మశానానికి చేరుకుంది. వీరి దీన స్థితిని చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్సై శేఖర్‌ వెంటనే ఇంటి యజమాని శ్రీనివాస్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తులసవ్వను జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

మరిన్ని వార్తలు