నల్లగొండ జిల్లా భువనగిరి ఆర్పీ నగర్లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణసంచా పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆర్పీ నగర్లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడిపిస్తుంటారు. అతడు తన షాపులో దీపావళి బాణసంచా అమ్మకానికి ఉంచాడు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండటంతో ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావును పిలిపించారు. అక్కడ ఓ సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది.
మరమ్మతులు చేస్తుండగానే సెల్ఫోన్ బాగా వేడెక్కడంతో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బాణసంచా కూడా అంటుకుంది. దాంతో ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావుతో పాటు, బాణసంచా కొనేందుకు వచ్చిన కళ్యాణ్ కూడా అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోశెట్టి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి, అక్కడి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.