భీకర కాల్పులు.. 108 మంది మృతి

27 Jul, 2017 07:39 IST|Sakshi
తాలిబన్‌ ఉగ్రవాదులు(ఫైల్‌)

- ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి
- 26 మంది సైనికుల మృతి.. 82 మంది ఉగ్రవాదులు హతం


కాబుల్‌:
ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల మెరుపుదాడి.. ఆ వెంటనే జవాన్ల ఎదురుదాడి.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 10 గంటలపాటు భీకర కాల్పులు! అఫ్ఘానిస్థాన్‌లోని కందహార్‌ ఫ్రావిన్స్‌లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ కొనసాగిన దాడి-ప్రతిదాడిలో 26 మంది జవాన్లు చనిపోగా, 82 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్ఘానిస్థాన్‌ రక్షణ శాఖ వెల్లడించింది.

కందహార్‌ ఫ్రావిన్స్‌లోని ఖక్రీజ్‌ జిల్లా కేంద్రం శివారులో గల బేస్‌ క్యాంపుపై వందల మంది తాలిబన్‌ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారని, తుపాకులతో దాడిచేస్తూ, సైనికుల వద్దనున్న ఆయుధాలను అపహరించే ప్రయత్నం చేశారని అఫ్టాన్‌ అధికారులు చెప్పారు. ఆ సమయంలో జవాన్లు సేదతీరుతున్నందువల్ల ప్రాణనష్టం జరిగిందని, అయితే, మిగిలిన జవాన్లు ఉగ్రవాదులను వీరోచితంగా ఎదుర్కొన్నారని, దాదాపు 80 మంది ముష్కరులను మట్టుపెట్టారని పేర్కొన్నారు.

దాదాపు 10 గంటలపాటు సాగిన ఎదురుకాల్పులు బుధవారం ఉదయానికి ఆగాయని, ప్రస్తుతం ఖజ్రీజ్‌ ప్రాంతమంతా సైన్యం ఆధీనంలోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఇక్కడి తాలిబన్‌ ఉగ్రవాదులు గత ఏప్రిల్‌ నుంచి దాడులకు పిలుపునిచ్చిన దరిమిలా అఫ్ఘాన్‌ రాజధాని కాబుల్‌ సహా దేశంలోని పలుచోట్ల వరుస దాడులు చోటుచేసుకున్నాయి. తాలిబన్లకు ఐసిస్‌ కూడా తోడుకావడంతో ఉగ్రవాదులు మరింతగారెచ్చిపోతున్నారు.

మరిన్ని వార్తలు