సీట్లు రాని విద్యార్థులకు మరో అవకాశం!

5 Aug, 2015 03:26 IST|Sakshi
సీట్లు రాని విద్యార్థులకు మరో అవకాశం!

* మరో దఫా ఇంజనీరింగ్ ప్రవేశాలపై కసరత్తు
* ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో కౌన్సెలింగ్
* తేలాల్సి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం
* సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం

 
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం కావాలి. అప్పటికేమైనా సీట్లు మిగిలితే ప్రకటన ద్వారా నోటిఫై చేసి ఆగస్టు 15లోగా వాటిని భర్తీ చేయొచ్చన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కౌన్సెలింగ్ పేరుతో కాకుండా ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో ఈ ప్రవేశాలను చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. దా దాపుగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఫీ జు రీయింబర్స్‌మెంట్‌తో ఇది ముడిపడి ఉన్నం దున సీఎంతో చర్చించాకే అధికారికంగా నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నారు.
 
 6 వేల వరకు అర్హులు
 మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థులు 9,321 మంది ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్‌లో 7,675 మందికి సీట్లు వచ్చాయి. మరో 1,646 మందికి సీట్లు రాలేదు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీల్లో చేరని విద్యార్థులు, మొదటి, చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లే రాని వారు మరో 4 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రవేశాలు చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి వెబ్ కౌన్సెలింగ్ అనే పేరు మాత్రం ఉండదు. కానీ ప్రవేశాల ప్రక్రియలో మొత్తం అదే విధానాన్ని అమలు చేస్తారు. తద్వారా పారదర్శకంగా ఇంజనీరింగ్ ప్రవేశాలను పూర్తి చేయడంతోపాటు ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోలేక నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టారు.
 
 నేడు లేదా రేపు పూర్తిస్థాయి షెడ్యూలు
 మిగులు సీట్ల భర్తీకి పూర్తిస్థాయి షెడ్యూలును బుధ లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, సీట్ అలాట్‌మెంట్ తేదీ, సెల్ఫ్ రిపోర్టింగ్ గ డువు ఖరారుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కాలేజీల్లో చేరి, సర్టిఫికెట్లు అందజేసిన విద్యార్థుల పరిస్థితిపై స్పష్టత రాలేదు. ఇదివరకే సీట్లు వచ్చి, ఫీజులు చెల్లించి, సర్టిఫికెట్లను అందజేసిన విద్యార్థులకు ఇపుడు కాలేజీని లేదా బ్రాంచీని మార్చుకునే (స్లైడింగ్) అవకాశం ఇస్తారా? కేవలం సీట్లు రాని విద్యార్థులకే ఈ అవకాశాన్ని కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు