అడ్వాణీకి షాక్‌.. 30న కోర్టుకు రావాల్సిందే!

25 May, 2017 18:29 IST|Sakshi
అడ్వాణీకి షాక్‌.. 30న కోర్టుకు రావాల్సిందే!

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీకి చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపునివ్వడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అడ్వాణీ సహా మరో బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టుకు హాజరు నుంచి ఈ ముగ్గురు నేతలకు మినహాయింపు ఇవ్వలేమని, వారు 30న విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.

1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఈ ముగ్గురు నేతలు క్రిమినల్‌ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై మరిన్ని అభియోగాలను కోర్టు మోపే అవకాశముందని భావిస్తున్నారు. 2001లో సీబీఐ కోర్టు క్రిమినల్‌ కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్‌ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. తాజాగా సుప్రీంకోర్టు అడ్వాణీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు