ఆస్పత్రిలో పెళ్లాడిన జంట

2 May, 2014 21:56 IST|Sakshi

రాయపూర్: కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ విషయాన్ని మరోమారు రుజువు చేసింది ఛత్తీస్గఢ్లోని ఓ జంట. విధి తమతో ఆడుకున్నా లెక్కచేయకుండా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆస్పత్రినే కళ్యాణమండపంగా చేసుకుని వివాహం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన వరుణ్ బాగ్(22)కు రూపాలి(22) అనే యువతితో పెళ్లి కుదిరింది. అక్షీయ తృతీయ రోజున పెళ్లి నిర్ణయమైంది.

అయితే రూపాలికి కామెర్లు సోకడంతో ఆమె డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మెడికల్ ఆస్పత్రిలో చేరింది. వీరి వివాహం ఆస్పత్రిలో జరిపించేందుకు యాజమాన్యం ముందుకు రావడంతో రూపాలిని వీల్ చైర్లోనే ఉండగానే వరుణ్ పెళ్లాడాడు. ఆస్పత్రిలోని మహిళల అవార్డు వేద మంత్రాలతో మార్మోగింది.

ఆస్పత్రి సిబ్బంది, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అయితే రూపాలికి ఇది ద్వితీయ వివాహం. రెండేళ్ల క్రితం ఆమెకు మొదట వివాహం జరిగింది. అయితే పెళ్లైన పది నెలలకే ఆమె మొదటి భర్త చనిపోయాడు. తమ పెళ్లి ఆస్పత్రిలో జరగడం పట్ల రూపాలి, వరుణ్ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు