ఐపీఎల్‌ వివాదం: సన్‌రైజర్స్‌కు ఝలక్‌!

8 Apr, 2017 19:07 IST|Sakshi
ఐపీఎల్‌ వివాదం: సన్‌రైజర్స్‌కు ఝలక్‌!

హైదరాబాద్‌: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ టోర్నమెంటు విషయంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు యాజమాన్యానికి, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి (హెచ్‌సీఏ) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల టికెట్ల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. టికెట్ల విషయంలో సన్‌రైజర్స్‌ జట్టు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని హెచ్‌సీఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.

సన్‌రైజర్స్‌ జట్టు యాజమాన్యం ఇలాగే ప్రవర్తిస్తే.. ఈ నెల 17న ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు సహరించబోమంటూ హెచ్‌సీఏ షాకిచ్చింది. ఐపీఎల్‌ పదో ఎడిషన్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఇటీవల ఘనంగా ‍ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అప్పటిలోగా టికెట్ల వివాదాన్ని పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ జెండా ఎగురవేస్తామని హెచ్‌సీఏ హెచ్చరిస్తోంది.

మరిన్ని వార్తలు