ఉద్రిక్తతలను నివారిద్దాం!

22 Sep, 2015 03:19 IST|Sakshi

భారత్, పాక్ నిర్ణయం
జమ్మూ: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు, ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేయాలని ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు నిర్ణయించారు. కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలో చకన్ దా బాగ్‌లో జరిగిన భేటీలో ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయని భారత రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన, పౌరులపై దాడులు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు.  

కాల్పులు, మోర్టార్ దాడులతో పాక్ విరుచుకుపడిన 20 రోజుల తర్వాత ఇరుదేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన తొలి భేటీ ఇది.   
 
‘దుశ్చర్యలు ఆపితేనే సత్సంబంధాలు’
సాంబా(కశ్మీర్): భారత్‌తో సత్సంబంధాలు కావాలనుకుంటే ఉగ్రవాదం, సరిహద్దులనుంచి చొరబాట్లు, సరిహద్దుల ఉల్లంఘన వంటి దుశ్చర్యలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పాకిస్తాన్, చైనాలకు స్పష్టంచేశారు. పొరుగుదేశాలపై ఆక్రమణలకు పాల్పడే ఉద్దేశాలు భారత్‌కు లేవని పేర్కొన్నారు. భారత్ ఇరుగు, పొరుగు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. సోమవారం ఆయన జమ్మూకశ్మీర్‌లో సరిహద్దులవద్ద కొత్తగా నిర్మించిన ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసుల కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

మరిన్ని వార్తలు