జనం దాడిలో యువకుడి మృతి

18 Jul, 2016 06:33 IST|Sakshi
జనం దాడిలో యువకుడి మృతి

- యువతిపై లైంగిక దాడికి యత్నం, హత్య చేశారనే అనుమానంతో ఇద్దరిని చితకబాదిన జనం..
- ఆ ఇద్దరిలో ఒకరు మృతి..
 
 నిజాంపట్నం/రేపల్లె రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మరణిస్తే.. అందుకు ఇద్దరు యువకులు కారకులంటూ స్థానికులు వారిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో ఆ యువకుల్లో ఒకరు మృత్యువాత పడ్డాడు.స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో షేక్ మెహరున్నీసా కుటుంబం నివసిస్తోంది.ఆదివారం కుటుంబీకులు మట్లపూడిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తె జాస్మిన్ (19) మాత్రం వెళ్లలేదు. కాగా కాసేపటికి ఆ ఇంటి నుంచి అడవులదీవికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ బయటికి వచ్చారు.

పొరిగింటికి వెళ్లి అక్కడున్న వృద్ధులతో జాస్మిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటోందని చెప్పారు. దీంతో స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె అచేతనంగా పడి ఉంది. మంచంపై నెత్తుటి మరకలు, తెగిన బెల్టు ఉండడంతో ఆ యువకులే లైంగిక దాడికి యత్నించి చంపేశారని భావించిన స్థానికులు వారిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న రేపల్లె టౌన్ సి.ఐ. మల్లికార్జునరావు, ఇతర సిబ్బంది యువకులను స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.  బాధిత కుటుం బానికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వారికి నచ్చజెప్పి యువకులను స్టేషన్‌కు తరలించారు. కాగా, వేము ల శ్రీసాయి బాపట్లలో బీటెక్, జొన్నా పవన్‌కుమార్ రేపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు.

 మార్గం మధ్యలో శ్రీసాయి మృతి
 నిందితుల్లో ఒకరైన వేముల శ్రీసాయి (18) ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో పోలీసులు అతడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వైద్యశాల సమీపంలో మృతి చెందినట్లు పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు తెలిపారు.

>
మరిన్ని వార్తలు