► నేపాలీ మహిళపై ‘హత్యాచారం’
► యువకుడు అరెస్టు
బనశంకరి : తన ఊరివాడే కదా అని ఆదరిస్తే అంతు చూశాడు. నేపాలీ మహిళపై వారి దేశానికే చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సర్జాపుర పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు .. నేపాల్కు చెందిన కరణ్ అనే యువకుడితో రెండేళ్లక్రితం నేపాల్ నివాసి పవిత్ర (20) అనే యువతితో వివాహమైంది. వీరు సర్జాపురలో అద్దె ఇంట్లో నివాసముంటూ భర్త సెక్యూరిటీగార్డుగా, భార్య ఇళ్లల్లో పనులు చేసేవారు. నేపాల్లోని తమగ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ తిలక్ అనే యువకుడు ఆమెకు సర్జాపురలో పరిచయమయ్యాడు.
తాను ఇబ్బందుల్లో ఉన్నానంటూ అతడు ఆమె నుంచి పలుమార్లు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆమె తిరిగి అడిగినా అతడు చెల్లించలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన పవిత్ర ఈ నెల 4 తేదీన ట్రినిటీ అపార్టుమెంట్ వద్దనున్న తిలక్ వద్దకు వెళ్లి డబ్బు అడిగింది. అతడు డబ్బులిస్తానని ఆమెను రహస్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి బండరాయితో తలపై మోది హత్యచేశాడు. ఆమె కనిపించకపోవడంతో భర్త కరణ్ సర్జాపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో తిలక్ ను మంగళవారం అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో హత్యవిషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తిలక్ అంగీకరించాడు.