ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు: ఆజాద్

17 Nov, 2016 15:31 IST|Sakshi
ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు: ఆజాద్
పాక్ ఉగ్రవాదులు ఉడీలో సైనిక శిబిరంపై దాడిచేసి, భారత సైనికులను దారుణంగా హతమార్చిన విషయమై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయడంలో ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల ఇప్పుడు చనిపోతున్నవారిలో సగం మంది కూడా ఉడీ ఉగ్రదాడిలో మరణించలేదని గులాం నబీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో గులాం నబీ ఏమన్నారో సరిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.